దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో గిరిజనులకు కేజీ నుంచి పీజీ వరకు గురుకుల విద్య అందిస్తున్నాం : రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
గిరిజన బాలికలు ఇంటర్ తర్వాత విద్య మానేస్తున్నారని గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు
నర్సంపేటలో మహిళా డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తాం
నర్సంపేటలో గిరిజన బాలుర గురుకుల జూనియర్ కాలేజీని ప్రారంభించిన
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
వరంగల్, హనుమకొండ- ఫిబ్రవరి 03
తెలంగాణ రాష్ట్రంలో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గిరిజనులకు 12,304 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయిస్తే…కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం 2022-23 ఆర్ధిక సంవత్సరానికి 8400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల పట్ల బిజెపి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.8శాతం గిరిజనులు అంటే కనీసం వీరి సంఖ్య 12 నుంచి 13 కోట్లకు ఉంటే వారికి ఇంత తక్కువ కేటాయింపులు చేయడాన్ని ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్న బిజెపి నేతలకు ప్రజలే సరైన బుద్ది చెప్తారన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో గిరిజన బాలుర గురుకుల జూనియర్ కాలేజీని మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్థానిక నేతలు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
దేశంలో ఎక్కడా లేని గురుకులాలు పెట్టడమే కాకుండా మహిళలు విద్యను మధ్యలో మానేయొద్దని వారికి ప్రత్యేకంగా గిరిజన గురుకులాలు పెట్టిన ఘనత సిఎం కేసిఆర్ కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. . నర్సంపేటలో గిరిజన మహిళా డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలోనే కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన గురుకుల విద్య అందుబాటులో ఉందన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు సైనిక స్కూల్ కూడా ఉందని… గిరిజన బిడ్డలు కేవలం జవాన్లుగానే ఉండి పోకూడదని…సైనిక ఉన్నతాధికారులు కావాలనే లక్ష్యంతో మనం ఈస్కూలును సాధించుకున్నామన్నారు. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ లా కాలేజీ, పీజీ కెమిస్త్రీ, ఇంటీరియర్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఫైన్ అర్ట్స్ వంటి కోర్సులు చాలా ఉన్నాయన్నారు. దేశంలో దళితులు,గిరిజనులు విదేశాల్లో చదువుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 23 యూనివర్శిటీల్లో అవకాశం కల్పించామన్నారు. ఇందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. సిఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించడం కోసం 1000కి పైగా గురుకులాలు పెట్టారని తెలిపారు .అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు పెట్టి అమలు చేస్తున్నామన్నారు .
డిగ్రీలో అమ్మాయిలకు గురుకులాలు లేక చదువు మానేస్తున్నారని గుర్తించి ఒకేరోజు 23 మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలు మంజూరు చేసిన ఘనత సిఎం కేసిఆర్ దక్కిందన్నారు. ఈ సంవత్సరం ఇక్కడ మహిళా డిగ్రీ కాలేజీని మంజూరు చేశామన్నారు .మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చుతున్నామన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలను అన్నింటిని 3వ వంతు వాటిని ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తున్నామని సత్యవతి రాథోడ్ అన్నారు .వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తామన్నారు. దీనివల్ల 1,30,000 మంది ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు లబ్ది పొందుతారని తెలిపారు.
దేశంలో గిరిజనుల జనాభా 8.8 శాతం అని… 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభా 130 కోట్లు అనుకుంటే…గిరిజనులు 12 నుంచి 13 కోట్ల మంది ఉంటారని తెలిపారు .
గత సంవత్సరం రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్12,304 కోట్లు అయితే ఈ ఆర్ధిక సంవత్సరం కేంద్రంలో గిరిజనుల బడ్జెట్ 8500 కోట్లు గా ఉందన్నారు . దీంతో గిరిజన, దళితుల పట్ల కేంద్రానికి ఎంత ప్రేమ ఉందని తెలుస్తుందన్నారు.