ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలు భర్తీ చేయాలి సీఎం జ‌గ‌న్

కోవిడ్ నియంత్ర‌ణ‌, వ్యాక్సినేష‌న్‌పై స‌మీక్ష‌లో సీఎం జ‌గ‌న్‌
అమరావతి,

మాసాంతానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీచేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జ‌గ‌న్ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. కోవిడ్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. అన్నిరాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారని అధికారులు సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకువ‌చ్చారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 1,00,622 అయితే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితులు కేవలం 2301 మందేనని అధికారులు తెలిపారు. ఇందులో ఐసీయూలో ఉన్నవారు 263 మంది, వీరుకూడా దాదాపుగా కోలుకుంటున్నారన్న అధికారులు సీఎంకు వివ‌రించారు . 2144 మందికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. 104 కాల్‌ సెంటర్‌కూ వస్తున్న కాల్స్‌ గణనీయంగా తగ్గాయని .. , ఇందులో ఆస్పత్రిలో జాయిన్‌ అయినవారు 18 మంది మాత్రమేనని వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ ముమ్మ‌రంగా సాగుతుంద‌ని…రెండు డోసులు వేసుకున్నవారు 3,73,71,243 కాగా, ఒక డోసు వేసుకున్నవారు 55,38,556, ప్రికాషనరీ డోస్‌ టార్గెట్‌ 12,60,047 కాగా ఇప్పటికే 9,79,723 మందికి వాక్సినేషన్‌ పూర్తి చేశామ‌న్నారు. రాష్ట్రంలో 15–18 ఏళ్ల మధ్య అందరికీ మొదటి డోసు పూర్తయ్యిందని వెల్లడించారు.

ఫిబ్రవరి నెలాఖ‌రులోగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీచేయాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నాడు – నేడు కింద చేపట్టిన పనులను, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు.గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టి పెట్టాల‌న్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడే ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తానని … గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాల‌న్నారు. ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో పూర్తిగా ఖాళీలను భర్తీచేయాలని జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్న సీఎం. డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పష్టంగా మార్పులు కనిపించాలా ఉండాల‌న్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌పోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *