తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నా రన్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ మినీ స్టేడియంలో ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన చీర్స్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని ఒలంపిక్స్ జ్యోతి ని ప్రముఖ మాజీ హాకీ ఆటగాడు, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్ నుండి అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా పాలసీ ని రూపొందించటానికి క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించబోతున్నామన్నారు. క్రీడల అభివృద్ధి కి అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 30 పైగా స్టేడియంల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఒలంపిక్స్ లో పతకాలు సాధించే ఆటగాళ్లు కు నగదు పురస్కారాన్ని గతంలో కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి, దేశం నుండి ఒలంపిక్స్ వెళ్తున్నా 115 మంది ఆటగాళ్లకు చీర్స్ చెప్పారు. ప్రతి ఆటగాడు తన శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని పతకాలు సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇంచార్జ్ అధ్యక్షుడు సముద్రాల వేణుగోపాల చారి, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్, ట్రిపుల్ ఒలంపియన్ ముఖేష్, SATS అధికారులు ధనలక్ష్మి, వెంకయ్య, మనోహర్ గౌడ్, నర్సయ్య, చంద్రారెడ్డి, కోచ్ లు, ప్రముఖ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, వివిధ క్రీడా అసోసియేషన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.