రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది : వైఎస్ షర్మిల
కామారెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ తక్షణమే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. కామారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. పాదయాత్రలో భాగంగా నిజాంసాగర్ మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వరకు నేడు పాదయాత్ర చేసిన షర్మిల దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం కేసీఆర్కు ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాలేదని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసీచూసీ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. కనీసం ప్రతిపక్షాలు సైతం నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా తాను పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం 72 గంటల దీక్ష చేశానని ఆమె గుర్తు చేశారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని ఆరోపించారు. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చేతకాకపోతే రాజీనామా చేసి.. దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలన్నారు.