తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది: చంద్రబాబు నాయుడు
తెలంగాణ లో టిడిపి హయాంలో
జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని..సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశం అయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ ప్రజల్లో టిడిపిపై అభిమానం నివురుగప్పిన నిప్పులా ఉంటుందని..అది ఎప్పుడైనా రాజుకుంటుంది, దానిని ఆర్పటంగాని, ఆపటంగాని ఎవరివల్లా కాదన్నారు..
ప్రజల్లో ప్రగాఢ అభిమానం ఉన్న పార్టీ తెలుగుదేశం. అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడమే నాయకత్వ పటిమ అని ఆయన అన్నారు.
పనిచేసేవాళ్లకే ప్రజల్లో గౌరవం ఉంటుందని..ప్రజల్లో గౌరవం ఉంటేనే పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు..పని చేయకుండా గౌరవం, గుర్తింపు దొరకవనేది గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ, ఏపి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ టిడిపి రూపొందించినవేనని .పవర్ ప్లాంట్లన్నీ టిడిపి నెలకొల్పినవే అని గుర్తు చేశారు .ఐటి, బిటి, ఫార్మా కంపెనీలన్నీ టిడిపి తెచ్చినవేనని..సామాజిక సంపద అంతా టిడిపి వల్ల పెరిగిందన్నారు…స్థానికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, దేశాభివృద్ధికి దోహదపడ్డామన్నారు.
వందేళ్ల బానిసత్వం, వందేళ్ల అభివృద్ధిగా దేశచరిత్రను వర్గీకరించాలి. టిడిపికి ముందు, టిడిపి తర్వాతగా రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రను చూడాలన్నారు.. ఒక పబ్లిక్ పాలసీ, ఒక విజన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అభివృద్ధి పథంలో నిలిపింది. వాజ్ పేయి హయాంలో చేపట్టిన టెలికం రెగ్యులేటరీ పాలసీనే నేడు 5జీ కి బాటలు వేసిందన్నారు. అప్పటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారులు, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఫార్మా రంగాల అభివృద్ధి కొత్తపుంతలు తొక్కిందని గుర్తు చేశారు.
అభివృద్ధికి అడ్డుపుల్లలు వేయడం అనాగరికమని ..పోటీబడి అభివృద్ధి చేయాలే తప్ప, చేసిన అభివృద్ధిని ధ్వంసం చేయకూడదన్నారు.
కొండలు, గుట్టలతో ఉండే ప్రాంతాలన్నీ ఈరోజు సంపద సృష్టించే కేంద్రాలయ్యాయంటే అదంతా టిడిపి అభివృద్ధి చేసిన సైబరాబాద్ ఘనతే అన్నారు .హైస్కూలు కూడా లేనిచోట ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పామన్నారు.
నిన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ టిడిపిలో చేరడం శుభపరిమాణమని… పార్టీలో చేరికలను మరింతగా ప్రోత్సహించాలన్నారు.
ఉన్న నాయకత్వం పదును తేలి, కొత్త నాయకత్వం రూపొందాలన్నారు. యువతకు పెద్దపీట వేయాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని…
ఏ ఊరికి పోయినా, ఏ పని చూసినా తెలుగుదేశం చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. ఏ ఊళ్లో స్కూల్ బిల్డింగ్ చూసినా, ఆసుపత్రి చూసినా, ప్రాజెక్టు చూసినా, పవర్ ప్లాంట్ చూసినా, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు చూసినా, ఐటి కంపెనీ చూసినా, ఫార్మా కంపెనీ చూసినా.. అంతటా టిడిపి చేసిన అభివృద్దే అని చెప్పారు.
హైదరాబాద్ లో అడుగడుగునా టిడిపి అభివృద్ధి ముద్రే కనిపిస్తుంది.
నన్ను గేలిచేయడం, నా విజన్ ను అవహేళన చేయడం ఇవాల్టిది కాదు..అప్పుడూ నన్ను ప్రపంచ జీతగాడన్నారు, విజన్ 2020ని 420 అన్నారు, ఇంకా చాలా అన్నారు. అవహేళన చేసినవాళ్లే నా అభివృద్ధి ఫలాలు పొందారు, పొందుతున్నారు కూడా..
మనం చేసిన పనులన్నీ కళ్లముందే ఉన్నాయి. వాటి ఫలితాలే ఈనాటి ప్రగతిబాటలు..
సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి, టిడిపి చేసిన అభివృద్ధిపై ఇంటింటికి ప్రచారం చేయాలి.
తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం తేవడమే శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళి’’గా చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రపార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కంభంపాటి రామమోహన రావు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, సామా భూపాల్ రెడ్డి, బంటు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.