తెలంగాణను అవహేళన చేసిన బీజేపీ నేతల తోకలు కత్తిరించాలి : కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణను అవహేళన చేసిన బీజేపీ నేతల తోకలు కత్తిరించాలని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నల్లచట్టాలు, విద్యుత్ సంస్కరణల పేరిట మీటర్లు ప్రైవేటుకు ధాన్యం సేకరణకు ప్రయత్నిస్తున్న రైతు వ్యతిరేకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశాడన్న మంత్రి మోడీ రైతుల ఆదాయం రెట్టింపు అంటూ వంచించారని ఆక్షేపించారు. నరేంద్ర మోడీ పాలనలో ఒకరిద్దరి సంపాదన మాత్రమే పెరిగిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
ఒక వ్యక్తి సంపాదన పెరిగితే దేశం బాగుపడినట్లు కాదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి కేంద్రం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని, అదేవిధంగా నల్గొండ జిల్లాకు రూ.18 వేల కోట్లు ఇవ్వాలని చెప్పామని పేర్కొన్నారు. రైతులంతా చైతన్యవంతులైనపుడే కేంద్రం ఏకపక్ష విధానాలకు కత్తెర పడుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి మన్నెగూడలో రైతు అవగాహన సదస్సుకు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రం సాగురంగంలో అగ్రగామిగా ఎదుగుతోందని కేటీఆర్ వివరించారు. రైతుబంధు, బీమా, రుణమాఫీ, ఉచిత కరెంట్తో దేశానికే ఆదర్శంగా మారిందని అన్నారు. అద్భుతమైన పంటలతో అలరారుతున్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ రైతులకు సూచించారు.ఈ సందర్భంగా నల్గొండకు నిధులిస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం సంపద పెంచి రైతులకు పంచిందని చెప్పారు. తెలంగాణలో పండిన ధాన్యమంతా కొనమంటే.. కేంద్రమంత్రి అవమానించేలా మాట్లాడారని విమర్శించారు. 8 ఏళ్లలో 68 లక్షల టన్నుల ధాన్యం నుంచి.. 3.50 లక్షల కోట్ల టన్నులకు ఎలా చేరాయని పీయూష్ గోయల్ను ప్రశ్నించారు.
తెలంగాణను అవహేళన చేసిన భాజపా నేతల తోకలు కత్తిరించాలని కేటీఆర్ అన్నారు. బావి దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రకు ప్రధాని మోదీ తెరలేపారని విమర్శించారు. ప్రీపెయిడ్ మీటర్లు పెడితేనే రాష్ట్రాలకు నిధులు ఇస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కూడా కేంద్రం చేతిలోకి వెళ్తే.. పెట్రోల్లాగే విద్యుత్ ధరలు విపరీతంగా పెరుగుతాయని కేటీఆర్ఆందోళన వ్యక్తం చేశారు.
“తెలంగాణ ఏర్పడిన నాడు ధాన్యం ఉత్పత్తి మొత్తం 68 లక్షల టన్నుల ధాన్యం ఉండేది. ఇప్పుడు తెలంగాణలో 3.50 లక్షల కోట్ల టన్నులకు చేరింది. 2014లో నల్గొండ జిల్లాలో పత్తి బాగా పండిస్తారు. ఇప్పుడు 62లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది. ఆనాడు 35లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే.. ఈరోజు 62లక్షల బేళ్ల ఉత్పత్తికి పత్తి చేరుకుంది. రైతుకు పెట్టుబడి రూపంలో రైతుబంధు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచించారని మంత్రి కేటీఆర్ అన్నారు.