నిజాయతీకి నిలువెత్తు రూపం స్వ‌ర్గీయ‌ దామోదరం సంజీవయ్య జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

భారత జాతి గర్వించదగిన రాజనీతజ్ఞుడు దామోదరం సంజీవయ్య అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అతి సాధారణ.. అందులోనూ అణగారిన వర్గాల కుటుంబంలో జన్మించి, అసాధారణ ప్రజానాయకునిగా ఆవిర్భవించిన ఆయ‌న జీవితం అంద‌రికి ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. మహానుభావుని జయంతి సందర్భంగా త‌న‌ తరపున, జనసేన శ్రేణుల తరపున ప్రణామాలు అర్పిస్తున్నామ‌న్నారు .. ఆ మహనీయుని సేవలను అందరం స్మరించుకోవాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు .

నాలుగు పదుల వయసు రాకుండానే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పనిచేశార‌ని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు జాతీయ అధ్యక్షునిగా భాధ్య‌త‌లు నిర్వ‌హించార‌ని గుర్తు చేశారు .ఆయ‌న‌ ప్రజలకు చేసిన సేవలు అద్భుతం, ఆదర్శప్రాయనీయ‌మ‌న్నారు.

దామోద‌రం సంజీవ‌య్య చేసిన సేవలు ఇప్పటికీ ఎవరూ చేరుకోనంత సమున్నతంగా ఉన్నాయంటే ఆయనలోని దార్శనికతకు జేజేలు పలకాల్సిందే అని అన్నారు. అణగారిన వర్గాల ఆరు లక్షల ఎకరాల భూముల్ని అందించిన భూదాతగా కీర్తి గడించారని గుర్తు చేశారు. వృద్ధాప్యపు పెన్షన్లు, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన సంక్షేమశీలి దామోద‌రం సంజీవ‌య్య అని కొనియాడారు. మద్యనిషేధ విభాగం, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటుచేసిన సంస్కర్త. కాపులకు రిజర్వేషన్లను అందించిన కాపు భాంధవుడు. స్వతహాగా జానపద గేయాలన్నా, నాటకాలన్నా అమిత ప్రేమగల సంజీవయ్య తన పాలనలో అధికార భాషగా తెలుగుకు పట్టం కట్టారని తెలిపారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పదవి భాద్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో 1965 మే 29వ తేదీన పార్లమెంట్‌లో బోనస్‌ చట్టాన్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికుల ప్రయోజనాలు సంరక్షించి ‘బోనస్‌ సంజీవయ్య’గా మన్ననలు అందుకున్నారని గుర్తు చేశారు. జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఈఎస్‌ఐ చట్టంలో ‘కుటుంబం’ అనే పదాన్ని చేర్చడమే కాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలోకి చేర్పించి కార్మిక పక్షపాతిగా ఖ్యాతి పొందారు. ఇలా చెప్పుకొంటే ఆయన ఈ దేశానికీ, తెలుగు ప్రజలకు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయ‌న్నారు.
మంత్రిగా పని చేసినా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చినా ఆయన ఎకరం పొలం గాని, ఆయనకంటూ ఒక ఇల్లుగాని సంపాదించుకోలేదన్నారు. నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం సంజీవయ్య అని… పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగి పేదగానే తనువుచాలించిన ఆదర్శమూర్తి సంజీవయ్య అని గుర్తు చేశారు .

దామోద‌రం సంజీవ‌య్య జన్మించిన జిల్లాకు ఆయ‌న పేరు పెట్టాలంటంటే నేటి పాల‌కులు ఒప్పుకోవ‌డం లేద‌న్నారు. ఆయన పుట్టిన ఇంటిని స్మారక చిహ్నంగా రూపుదిద్దాలన్న ప్రజల కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింద‌న్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *