లండన్ పొమ్మంటోంది.. జైలు రమ్మంటోంది. ఇక నీరవ్ మోదీకి మడతే..!
పంజాబ్ నేషనల్ బ్యాంకును భారీగా ముంచి లండన్కు పారిపోయిన.. ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి పెద్ద షాక్ తగిలింది. తనను భారత్కు అప్పగించవద్దంటూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసే అవకాశామివ్వాలని వేసిన పిటిషన్ను లండన్ రాయల్ కోర్టు కొట్టివేసింది. తనకు అనారోగ్య సమస్యలున్నాయని, భారత్కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయంటూ గత నెలలో నీరవ్ ఇదే కోర్టులో పిటిషన్ వేయగా, తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని భారత్కు అప్పగించకుండా తప్పించుకునే మార్గాలు దాదాపు లేవు. అయితే ఐరోపా మానవ హక్కుల న్యాయస్థానంలో విజ్ఞప్తి చేసుకొనే అవకాశమొక్కటే మిగిలింది.
2018లో భారత్ నుంచి పారిపోయిన నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ.16 వేల కోట్ల మేర మోసం చేయడంతో పాటు మనీ లాండరింగ్, సాక్ష్యాల చెరిపివేత వంటి నేరాలకు పాల్పడినట్లు సీబీఐ, ఈడీలు అభియోగాలు మోపాయి. ఈ కేసుల్లో 2019 మార్చి నుంచి అప్పగింత వారెంట్లు విచారణలో ఉన్నాయి.
