ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్
హైదరాబాద్
కరోనా, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని భావిస్తోంది. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్ ధరల ప్రభావంనుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని ఆర్టీసీ అధికారులు సిఎం కెసిఆర్ కు స్పష్టం చేశారు.
రాబోయే కేబినెట్ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్న సిఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
కరోనా లాక్ డౌన్ తో పాటు కేంద్రం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరల కారణంగా ఆర్టీసీ ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోతున్నదని, ఆర్టీసీని ఆర్ధిక సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఉన్నతాధికారులు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ కు విన్నవించుకున్నారు.
ఆర్టీసీ పరిస్థితి పై మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
గత సంవత్సరంన్నర కాలంలో డీజీల్ ధరలు లీటరుకు రూ. 22 రూపాయలు పెరగడం మూలాన ఆర్టీసీ పై రూ. 550 కోట్లు అధనపు ఆర్ధిక భారం పడుతున్నదని అధికారులు సిఎం కు వివరించారు. డీజిల్ తో పాటు టైర్లు ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతున్నదన్నారు. వీటన్నిటి ద్వారా మొత్తంగా సాలీనా రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయవలసి వస్తున్నదని తెలిపారు.
కరోనా తో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసి పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు వాపోయారు. ఈ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోయిందని ఆర్టీసీ అధికారులు సిఎం కెసీఆర్ కు వివరించారు. కేవలం హైదరాబాద్ పరిథిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు.
ఇటువంటి కష్ట కాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ.. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సిఎం కెసిఆర్ కు మంత్రి, సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు విన్నవించుకున్నారు.
గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచుతామని ప్రకటిందని, కాగా కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా వారు సిఎంకు తెలిపారు. ఇప్పటికే, ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే ఆర్టీసీని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తున్నదని, ఇంకా కూడా ప్రభుత్వం మీదనే అదనపు భారం మోపాలనడానికి తమకు మాటలు రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్ ధరల ప్రభావంనుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులు సిఎం కెసిఆర్ కు స్పష్టం చేశారు. నష్టాల్లోంచి బయటపడేందుకు చార్జీలు పెంచడం సహా ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సి వున్నదని వారు తెలిపారు.
ఆర్టీసీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదన్నారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని రాబోయే కేబినెట్ సమావేశం ముందుకు రావాలని, అందులో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సిఎం తెలిపారు.
ఇదే సందర్భంలో… రాష్ట్రంలో విద్యుత్తు అశం పై విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి, సిఎండీ ప్రభాకార్ రావు సిఎం కెసిఆర్ తో చర్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే విద్యుత్తు సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని వారు సిఎం కు వివరించారు. గత ఆరేండ్లు గా విద్యత్ చార్జీలను సవరించలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి విద్యుత్ చార్జీలు పెంచాలని వారు సిఎం కెసిఆర్ కు విన్నవించుకున్నారు.
కాగా….అటు ఆర్టీసీ తో పాటు విద్యుత్ అంశాలకు సంబందించి రాబోయే కేబినెట్ లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సిఎం వారికి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని రవాణా శాఖా మంత్రిని, విద్యుత్ శాఖా మంత్రిని సంబంధిత అధికారులను సిఎం కేసిఆర్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో … ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మేల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిసిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు,జెన్ కో అండ్ ట్రాన్స్ కో సిఎండీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.