కూచిపూడి నృత్యంతో అందరిని మెప్పించిన ఫల్య గుడిపూడి
హైదరాబాద్ ,రవీంద్రభారతి
ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి శిశ్యురాలు ఫల్య గుడిపూడి చేసిన నృత్య ప్రదర్శన అహుతులను అలరించింది.
హైదరాబాద్ రవీంద్రభారతిలో ఫల్య గుడిపూడి కూచిపూడి రంగ ప్రవేశంలోనే అద్బుత నృత్యంశాలు ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. నృత్యం, అభినయం, హావభావావాలు ప్రదర్శిస్తూ ఫల్య చేసిన నాట్యం ప్రదర్శనప్రేక్షకులను కట్టిపడేసింది.
గత తొమ్మిదేళ్లుగా కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న ఫల్య గుడిపూడి శంకరపల్లి ఇండోస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 11వ తరగతి చదువుతోంది. చదువులో రాణిస్తూనే మరో వైపు శాస్త్రీయ కూచిపూడి నాట్యం, క్రీడలు, ఫోటోగ్రఫీ లోను తన ప్రతిభను చాటుకుంటోంది. గణపతి ని స్తుతిస్తూ అరగేంట్రం ప్రారంభించిన ఫల్య పద్మభూషణ్ వెంపటి చిన సత్యం నృత్య కల్పన చేసిన “మరకత మణి మాయ చేలా” అంశాన్ని ఎంతో పరిణత తో ప్రదర్శించి ఆకట్టుకుంది. రాగమాలిక లో శ్రీరామ పదం, శివరంజని లో సమకూర్చిన మహేశ్వరీ మహాకాళి అంశాలను రసరమ్యంగా ప్రదర్శించింది. స్మర సుందరాంగుణి అంటూ ఉల్లాసంగా జావళి ప్రదర్శించి అలరించింది.ఈ కార్యక్రమానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ తాడేపల్లి, తెలంగాణ సిఐడి డిఐజి ఎ.వి.రఘునాథ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ ఛాయగ్రాహకులు అరవింద్ ఛేంజి అతిధులుగా విచ్చేసి ఫల్య గుడిపూడి ని ఆశీర్వదించి అభినందించారు.
ఈ నాట్య ప్రదర్శనకు నట్టువాంగం గురు అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి చేయగా, కౌశిక్ కళ్యాణ్ గాత్రం, జయకుమార్ వయోలిన్, దత్తాత్రేయ వేణువు, సుధాకర్ రాయప్రోలు వీణ, శివకుమార్ ఘటం తో సంగీతాన్ని అందించి రక్తి కట్టించారు. కేశవ సిద్ధార్ధ వ్యాఖ్యానం చేయగా, గుడిపూడి రాఘవేంద్రరావు సమన్వయకర్త గా వ్యవహరించారు.