నగరంలో నేటి నుండి పది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమం:మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నగరంలో మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల నివారణకై ఆదివారం నుండి పది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమాలను గ్రేటర్ హైదరాబాద్ లో చేపడుతున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపు మేరకు ఈ రోజు నుండి చేపడుతున్న దోమల నివారణ క్యాంపెన్ను విజయవంతం చేయాలని జిహెచ్ఎంసి మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలని జిహెచ్ఎంసి మేయర్ తెలిపారు
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మలేరియా, డెంగ్యు, చికెన్గున్య వ్యాధులను అరికట్టుటకై యాంటి లార్వా క్యాంపెన్ను నిర్వహించాలని సూచించారు. దోమల గుడ్లను నశింపచేయుటకు ఇండ్లు, కార్యాలయాలలో ఉన్న నీటి నిల్వలను ఖాళీ చేయించి పరిశుభ్రంగా పొడిగా ఉంచాలని తెలిపారు. తద్వారా దోమల వ్యాప్తి నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా పఈ రోజు ఉదయం 10గంటలకు 10 నిమిషాల పాటు మేయర్ తన నివాసంలో ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కల్లోని నీటి నిల్వలు మరియు పెరటిలో పేరుకు పోయిన నీటి ని తొలగించారు
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పదినిమిషాలు ఎవరి ఇంట్లో వారు దోమల పెరుగుదలకు ఉపయోగపడే వస్తువులను తొలగించాలని మేయర్ విజయ లక్ష్మీ తెలిపారు.
ముఖ్యంగా ఇండ్లు, ఇండ్లు పరిసరాలు, ఆఫీసులు పరిశ్రమలు, మూతలు లేని ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు ,సిమెంట్ హౌస్ తొట్టిలు, కుండీలు , కూలర్లు నల్లకుంటలు, పాత టైర్లు, పూల కుండీల కింద ప్లేట్లు, తాగి పడేసిన కొబ్బరిబొండాలు, ఇతర పనికిరాని పగిలిపోయిన వస్తువులలోని నిల్వ నీటిలో దోమలు గుడ్లు పెట్టి పెరుగుతాయన్నారు.
దోమల వ్యాప్తి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత.
దోమల రహిత నగరం కోసం కలిసి పోరాడుదాం అని మేయర్ అన్నారు.