నాయకులంటే ఎన్టీఆర్, చంద్రబాబు : టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు
ప్రస్తుత రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జగన్, కేసీఆర్ నాయకుల ప్రవర్తన తీరు చూస్తుంటే వెగటు పుడుతుందని, అసలైన రాజకీయ నిఖార్సయిన నాయకులు అంటే స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి బక్కని నర్సింహులు మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన రాణించారని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి, తాలూకాలను తీసివేసి మండల వ్యవస్థను తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దని గుర్తు చేశారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, విద్య, ఉద్యోగ విధానాలతో పాటు ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చారన్నారు. ఆయన బాటలోననే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2020 విజన్ ద్వారా ఎంతో ప్రగతిని సాధించారని గుర్తు చేశారు. జన్మభూమి, శ్రమదానం లాంటి కార్యక్రమాలు చేపట్టి విద్య ఆరోగ్య ఉపాధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు అని అన్నారు. సైబరాబాద్ అంటేనే చంద్రబాబు అని గుర్తు చేశారు.
వస్తున్న మీకోసం అంటూ
ఉమ్మడి రాష్ట్రంలో తమదైన ముద్ర వేసి నేటికీ వారి సేవలు ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. ముఖ్యంగా రాముడైనా, కృష్ణుడైన, బ్రహ్మంగారైనా యుగ పురుషుడు అంటే ఎన్టీఆర్ అనే స్థాయిలో పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఇరువురు మహానేతలకు సాటి పోటీ ఎవరూ లేరన్నారు. ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇరువురు నాయకుల తీరుతో రాజకీయాలు బ్రష్టు పట్టిపోయాయని అన్నారు. రాజకీయం అంటే బూతులు అనే కొత్త అర్ధాన్ని తెచ్చారన్నారు. ప్రతిపక్షాలను అవమానపరిచి, అణగదొక్కే విధంగా టిఆర్ఎస్, వైయస్సార్ సిపి పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, నాయకులంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అంటూ ఆయన కీర్తించారు.
ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ప్రజల్లో ఆంధ్ర తెలంగాణ అనే భేదభిప్రాయాలు తీసుకురావడం, తెలుగుదేశం పై వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల కొంత నష్టం జరిగిందని, ఈ లోటు పూడ్చుకోవడానికి పార్టీ బలోపేతం చేసే ముందు కెల్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చల్ల వెంకటేశ్వర రెడ్డి, గంధం ఆనంద్, విట్యాల అంజయ్య, కావలి నరసింహులు, బాలమోని హనుమంతు యాదవ్, మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రమేష్, అంజయ్య, శీను, బత్తిని నరసింహ గౌడ్, సంతోష్ సాగర్, నరేష్ ముదిరాజ్, సత్యనారాయణ, బక్కని జగన్, జంగయ్య, బాబు నాయక్, డి అనంతయ్య, గంటల శంకరయ్య, చంద్రశేఖర్ గౌడ్, రవికుమార్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు..