తెలంగాణలో భూములు విలువలు పెంపు
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుంలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది.
ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్, తత్సంబంధిత 20 రకాల సేవలపై విధించే ఛార్జీలను పెంచనున్నారు. తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్ఠంగా 50 శాతం పెరగనుండగా.. ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర పెరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2020 జనవరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధం చేసిన నివేదికలోని అంశాలతో పాటు ఏడాదిన్నర వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రాతిపదికగా చేసుకుని భూముల విలువను నిర్ధారించినట్టు సమాచారం. గతంలో ప్రతిపాదనలు రూపొందించినపుడు ప్రాంతీయ రింగ్రోడ్డు మాట లేదు. తాజాగా అది తెరపైకి వచ్చిన క్రమంలో దానికి చేరువలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగటాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. విలువలు ఖరారు చేస్తూ తాజాగా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.