హైదరాబాద్‌లో కందుకూరు టీడీపీ ఇంచార్జ్ ఇంటూరు నాగేశ్వర రావు అరెస్ట్

అమరావతి :

ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావును ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా గత నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరులో పర్యటించారు. స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం మధ్యాహ్నం నాగేశ్వరరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ నుంచి రెండు వాహనాల్లో వెళ్లిన పోలీసులు మియాపూర్‌లోని తన ఇంట్లో ఉన్న నాగేశ్వరరావును బలవంతంగా అదుపులోకి తీసుకున్నట్టు ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయితే నాగేశ్వరరావును ఎక్కడి తీసుకెళ్లారనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి అనేక మందిపై కేసు నమోదు చేసినప్పటికీ ప్రధానంగా ఇన్‌ఛార్జి నాగేశ్వరరావు నేతృత్వంలోనే అక్కడ సభ ఏర్పాట్లు జరిగినందున తొలుత అతన్నే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి నాగేశ్వరరావును కందుకూరు తీసుకొస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *