GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వరుసగా రెండోసారి ACI వరల్డ్ ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు
హైదరాబాద్, 10 ఫిబ్రవరి 2022:
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి(GHIAL) వరుసగా రెండోసారి ACI వరల్డ్ (ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) వారి “వాయిస్ ఆఫ్ కస్టమర్” గుర్తింపు లభించింది.
2021లో కోవిడ్ సమయంలో ప్రయాణీకుల అవసరాలను అర్థం చేసుకుని, దానికి తగిన చర్యలను తీసుకుంటూ చేసిన నిరంతర కృషికి ఈ గుర్తింపు లభించింది. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో పోషించిన చురుకైన పాత్రకు గాను హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ గుర్తింపు దక్కింది.
ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో నూతన వేరియెంట్లు బయటపడుతున్న సందర్భంలో ఎయిర్ పోర్టు ఆపరేటర్లు ప్రయాణికులకు అందించే సర్వీసుల విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేకుండా అతి తక్కువ సమయంలో తమకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ విమానాశ్రయం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసింది.
కోవిడ్ ప్రపంచంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేయగా, అందులో ఎక్కువగా ప్రభావితమైనది విమానయాన రంగం. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల నమ్మకాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో హైదరాబాద్ విమానాశ్రయంలో కాంటాక్ట్లెస్ ఎలివేటర్లు, కాంటాక్ట్లెస్ ఇన్ఫర్మేషన్ డెస్క్లు, డిజిటల్ లావాదేవీలు, షాపింగ్ కోసం యాప్ బేస్డ్ టెక్నాలజీలు, , ప్యాసింజర్ బ్యాగేజ్ యొక్క UV శానిటైజేషన్, క్యాబ్ల పరిశుభ్రత, గాలి శుభ్రతను పెంచడానికి HEPA ఫిల్టర్లు వంటి అనేక చర్యలు చేపట్టింది.
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఇఓ ప్రదీప్ పణికర్ “వరుసగా రెండోసారి ఈ గుర్తింపును పొందడం మాకు దక్కిన గౌరవం. మా భాగస్వాములందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రస్తుత పరిస్థితులలో ప్రయాణికుల విశ్వాసాన్ని పొందడానికి ఉమ్మడిగా కృషి చేయడం చాలా అవసరం. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మేం విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనల అమలుకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ప్రయాణికుల భద్రత కోసం వీడియో అనలిటిక్స్ వినియోగం, అదనపు ఆర్టీ-పీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు వంటి అనేక చర్యలు తీసుకున్నాం. విమానాశ్రయ ఆపరేటర్గా మాకు ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యం. దానికోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం’’ అన్నారు.
జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు జీఎంఆర్ నిర్వహిస్తున్న మరో విమానాశ్రయం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికీ ఈ గుర్తింపు లభించింది.
జీఎంఆర్ హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలు రెండూ గత ఏడాది ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI), ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) 2020 అవార్డులను గెల్చుకున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ 15-25 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానమ్ (MPPA) విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్’ అవార్డు లభించగా, ఢిల్లీ విమానాశ్రయం 40 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానమ్(MPPA) పైబడిన విభాగంలో ‘అవార్డు లభించింది. ASQ అనేది ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయలలో ప్రయాణీకుల సేవ, విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుల సంతృప్తిని కొలిచే బెంచ్ మార్కింగ్ కార్యక్రమం.
ప్రపంచ విమానాశ్రయాల వాణిజ్య సంఘం అయిన ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ) 1991లో స్థాపించబడింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ది సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సహా సభ్య విమానాశ్రయాలు, ప్రపంచ విమానయాన రంగంలోని ఇతర భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. విధాన అభివృద్ధి ముఖ్య దశలలో విమానాశ్రయాల ప్రయోజనాలను కాపాడడం, సురక్షితమైన, సమర్థవంతమైన, పర్యావరణపరంగా సుస్థిరమైన ప్రపంచ వాయు రవాణా వ్యవస్థను నెలకొల్పడానికి ACI గణనీయమైన కృషి చేస్తుంది