కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలి పెట్టు : మాజీ ఎంపీ మైసూరారెడ్డి
హైదరాబాద్
రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడం జటిలం చేసుకుంటున్నారని మాజీ ఎంపీ మైసూరారెడ్డి మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కారించుకోవల్సి అంశాలను ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు. రాజకీయ లబ్ధికోసం ఘర్షణపడి రాయలసీమ నీటి ప్రాజెక్టులను గందరగోళంలోకి నెట్టేశారని మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. నదీజలాల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలని ఆయన సూచించారు. ఎందుకు భేషజాలు అడ్డం వస్తున్నాయని ప్రశ్నించారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఓ ప్రభుత్వం ఉండి ఉంటే అన్యాయం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి కేటాయించిన జలాలు ఆయా ప్రాజెక్టులకు కేటాయించుకునే స్వేచ్ఛ ఏపీకి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అని మైసూరా ఆక్షేపించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు నీటి సమస్యలను చర్చించుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఏపీకి మంచిది కాదని హితవుపలికారు. కేంద్రం నోటిఫికేషన్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టని మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు.