బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచిత కన్సల్టేషన్ సేవలు , 20 శాతం తగ్గింపుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను ప్రతి ఏటా ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్యాన్సర్ పై విస్తృత అవగాహన కలిపించడంతో పాటూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపడుతారు. అంతే గాకుండా ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నాడు అందరికీ క్యాన్సర్ చికిత్స అందించేలా కృషి చేయడం అన్న ప్రత్యేక నినాదం చేపట్టడం జరిగింది. తద్వారా ఎటువంటి బేదాలు లేకుండా అందరికీ క్యాన్సర్ చికిత్స అందించడం దీని లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతుగా భారత దేశంలోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ హాస్పిటల్ గా పేరు గడించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ,రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నాడు హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లందరికీ ఉచితంగా కన్సల్టేషన్ సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ ఉచిత కన్సల్టేషన్ సేవలు మొదటి సారి హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లతో పాటూ వైద్యులను తిరిగి సంప్రదించడానికి వచ్చే పేషెంట్లకు కూడా వర్తిస్తుందన్నారు. అంతే గాకుండా ఫిబ్రవరి 4 నాడు హాస్పిటల్ లో అందుబాటులో ఉండే పలు లాబొరేటరీ, రేడియాలజీ, న్యూక్లియస్ మెడిసిన్ లాంటి విభాగాలలో వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకునే వారికి ఫీజు మొత్తంలో 20 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తామన్నారు.
ఈ సదవకాశాన్ని పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.