కనకరాజు, డోలి రామచంద్రయ్యలకు కోటి రూపాయల రివార్డు, సొంతింటికోసం నివాసయోగ్యమైన స్థలం ప్రకటించిన సీఎం కేసిఆర్
గిరిజనుల తరపున సీఎం కేసిఆర్ కి ధన్యవాదాలు
గిరిజనులకు ఈ ప్రభుత్వంలో ఉన్న గౌరవానికి సీఎం ఈ ప్రోత్సాహమే నిదర్శనం
తెలంగాణ ప్రభుత్వంలో గిరిజనులు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారు
రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
హైదరాబాద్:
అంతరించిపోతున్న కళలకు జీవం పోస్తూ కళే జీవితంగా బతుకుతున్న ఆదివాసీ కళాకారులు, గిరిజన ఆణిముత్యాలు పద్మశ్రీ గుస్సాడి కనకరాజు, డోలి రామచంద్రయ్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్కరికి కోటి రూపాయల రివార్డు, సొంతింటి కోసం నివాస యోగ్యమైన స్థలాన్ని ప్రకటించారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సీఎం కేసిఆర్ రామచంద్రయ్య అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నాయకత్వంలో గిరిజనులు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావులు అన్నారు.
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, గిరిజన జాతర, పండగలను అత్యంత ఘనంగా, అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
మహారాజ్ సేవాలాల్ జయంతి, కొమురం భీం వర్ధంతి, మేడారం జాతర, నాగోబా జాతర, జంగూ బాయ్ జాతర ఇలా ప్రతి గిరిజన, ఆదివాసీల పండగలు, మహనీయుల దినోత్సవాలను తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ఘనంగా నిర్వహిస్తున్నాం అన్నారు.
గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు, గిరిజనులను వ్యాపార వేత్తలు చేసేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
నేడు పద్మశ్రీలు పొందిన ఇద్దరు ఆదివాసీ కళాకారులకు కోటి రూపాయల రికార్డు, సొంతింటి స్థలం ఇచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా పద్మశ్రీ పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించిన ఘనత కూడా సీఎం కేసిఆర్ కు దక్కింది అన్నారు.
గిరిజనులు, ఆదివాసీల ఔన్నత్యాన్ని ఇనుమడింప చేస్తున్న సీఎం కేసిఆర్ కు గిరిజన, ఆదివాసీల తరపున మరోసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
డోలి రామచంద్రయ్య గహఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి పనులను సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ పనులను సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ప్రగతి భవన్ లో పద్మశ్రీ డోలి రామచంద్రయ్య సీఎం గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాత మధు, ఎమ్మెల్యే లు జీవన్ రెడ్డి, మెతుకు ఆనంద్, బిగాల గణేష్, ఇతర నాయకులు ఉన్నారు.