అక్రమ ఆయుధ విక్రయ ముఠా అరెస్ట్.. ఎక్కడంటే..!

ఏపీలో అక్రమ ఆయుధ విక్రయ ముఠాలను అరెస్టు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధ విక్రయ ముఠాలను అరెస్టు చేసినట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి ,అనంతపురం కేంద్రంగా జరుగుతున్న ఆయుధాల దందాలో కీలక నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నకిలీ కరెన్సీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆయుధాల అక్రమ తయారీ గుట్టు వెలుగులోకి వచ్చిందన్నారు. బెంగుళూరుకు చెందిన రౌడీషీటర్లు జంషీద్‌, ముబారక్‌, రియాజ్‌, అమీర్‌ షాషాలను విచారించగా మధ్యప్రదేశ్‌లో తయారీ కేంద్రం ఉన్నట్లు తేలిందని చెప్పారు. వీరితో పాటు ఆయుధాలు తయారు చేస్తున్న రాజ్ పాల్ సింగ్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఇతడు గతంలో హత్యలు, నకిలీ కరెన్సీ చెలామణి, ఆయుధాల విక్రయాలు, గంజాయి స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించామన్నారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితుల నుంచి 18 ఆయుధాలతోపాటు 95 రౌండ్ల బుల్లెట్లు 6 అదనపు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో 9ఎంఎం ఫిస్టల్స్, తపంచా, రివాల్వర్లు ఉన్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *