గర్భాశయంలో ఏర్పడిన 3 కిలో గ్రాముల ట్యూమర్ ను విజయవంతంగా తొలగించిన లంగర్ హౌజ్ రెనోవా హాస్పిటల్స్ వైద్యుల బృందం
గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఒక ప్రయివేటు స్కూలు లో టీచర్ గా పని చేస్తున్నారు. ఆమె 15 సంవత్సరముల క్రితం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు అవసరమైన చికిత్స తీసుకొన్నారు. అప్పటి నుండి క్యాన్సర్ కు సంబంధించిన ఎటువంటి లక్షణాలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె కడుపులో విపరీతమైన నొప్పి, ఉబ్బి పోయిన కడుపు, విపరీతమైన వెన్నుముక నొప్పి తదితర లక్షణములతో భాదపడుతూ పలువురు వైద్యులను సంప్రదించారు.
అయితే ఆమెకు ఉన్న భారీ ట్యూమర్ కారణంగా వైద్యం అందించడానికి అక్కడి వైద్యులు నిరాకరించగా, ఆమె హైదరాబాద్ లంగర్ హౌజ్ లోని రెనోవా హాస్పిటల్ కు చెందిన గైనకాలజిస్ట్ డా. రాజశ్రీ ని సంప్రదించడం జరిగింది. సదరు పేషెంటు పై MRI, CT లాంటి పరీక్షలు నిర్వహించగా గర్భాశయంలో అతి పెద్ద ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. దానిని వెంటనే తొలగించకపోతే ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చని గ్రహించిన వైద్యులు డా రాజశ్రీ సదరు రోగిని రెనోవా హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ ఆంకో సర్జన్ డా. సంజయ్ కు రెఫర్ చేశారు. ఇరువురు వైద్యులు సర్జరీ ద్వారా ట్యూమర్ ను తొలగించాలని నిర్ణయించారు.
తదనుగుణంగా రెనోవా హాస్పిటల్స్ కు చెందిన వైద్య బృందం డా. సంజయ్, డా. రాజశ్రీ, గైనకాలజిస్టు ల నేతృత్వంలో విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి గర్భాశయం తో పాటూ కణజాలంలోనికి చొచ్చుకు పోయిన ట్యూమర్ అవశేషాలతో సహా తొలగించడం జరిగింది. తొలగించిన ట్యూమర్ మూడు కిలోగ్రాముల బరువు తో ఉండడం జరిగింది. అనంతరం సదరు శరీర భాగాలను హిస్టోపాథలాజికల్ పరీక్షకు పంపించడం జరిగింది. సర్జరీ అనంతరం పేషెంట్ ఎటువంటి పోస్ట్ సర్జికల్ ఇబ్బందులు లేకుండా కోలుకొన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న పేషెంట్ ను హాస్పిటల్ వైద్యులు డిశ్చార్జ్ చేసి తదుపరి పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.
ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డా. రాజశ్రీ, మాట్లాడుతూ గర్భాశయంలో 3 కిలోగ్రాముల బరువుతో కూడిన ట్యూమర్ ఎంతో అరుదుగా ఏర్పడుతుందని చెప్పారు. ఇలాంటి ట్యూమర్లను గుర్తించడం ఒక ఎత్తైతే దాని వలన ప్రాణాపాయ స్థితి ఏర్పడకుండా విజయవంతంగా తొలగించడం వైద్యులకు కత్తిమీద సాములాంటిదని చెప్పారు. అయినప్పటికీ రెనోవా హాస్పిటల్స్ కు చెందిన ఆంకో సర్జన్ డా. సంజయ్ నేతృత్వంలో వైద్య బృందం ఎంతో శ్రమకోర్చి తగిన జాగ్రత్తలతో శస్త్ర చికిత్సను విజయవంతం పూర్తి చేశారు. సర్జరీ అనంతరం రోగి పూర్తిగా కోలుకోవడం సంతోషాన్ని ఇస్తోందని వారు చెప్పారు.
ఇలాంటి అరుదైన పరిస్థితులలో ఉన్న రోగులు అన్ని సదుపాయాలను కలిగిన హాస్పిటల్స్ లోని నిపుణులైన వైద్యులను సంప్రదిస్తే ప్రమాదం నుండి వారిని కాపాడవచ్చని వైద్య నిపుణులు సూచించారు.