సంక్రాంతి తిరుగుప్రయాణానికి 3 వేల ప్రత్యేక బస్సులు :టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
ఆంధ్రప్రదేశ్ నుంచి 212 బస్సులు
అధికారులతో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సమీక్ష
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన సిబ్బందికి అభినందనలు
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు. గత సంక్రాంతితో పోల్చితే దాదాపు 5 లక్షలు మంది ఎక్కువగా తమ బస్సుల్లో ప్రయాణించినట్లు ఆయన పేర్కొన్నారు.
సంక్రాంతి తిరుగుప్రయాణానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై అధికారులతో హైదరాబాద్ బస్ భవన్ నుంచి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు సోమవారం ఆన్ లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చిన సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తిరుగు ప్రయాణంలోనూ అదే రకంగా పనిచేసి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు.
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11 నుంచి 14 వరకు 3203 ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపారు. ఆయా రోజుల్లో 2384 బస్సులను నడపాలని నిర్ణయించగా.. రద్దీ దృష్ట్యా అదనంగా మరో 819 బస్సులను నడిపినట్లు ఆయన వివరించారు. నాలుగు రోజుల్లో 1.57 కోట్ల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయని తెలిపారు. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లోనే తమ సంస్థను ఇలానే ప్రోత్సహించాలని కోరారు.
టోల్ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించకుండా.. ఈ సారి ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.ఈ ప్రత్యేక లేన్ల వల్ల వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని వివరించారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మంగళవారం నుంచి తిరుగుప్రయాణమయ్యే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణం కోసం దాదాపు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 212 ప్రత్యేక బస్సులున్నాయని.. విజయవాడ 54, విశాఖపట్నం 19, అమలాపురం 23, శ్రీకాకుళం 9, ఏలూరు 11, రాజమండ్రి 12, గుంటూరు 29, బాపట్ల 5, చీరాల 7, మచిలీపట్నం 5, గుడివాడ 6, తెనాలి 4, రాజోలు 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఈ సర్వీసులన్నీ మంగళ, బుధవారాల్లో నడుస్తాయని వివరించారు.
రాబోయే రెండు, మూడు నెలలు టీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు అధికారులందరూ పని చేయాలని ఆదేశించారు.