వర్షాకాలం నాలాల అభివృద్ధి పనులు వేగవంతం చేయండి : మంత్రి కేటీఆర్
వర్షాకాలానికి రూపొందించుకున్న ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని జిహెచ్ఎంసి యంత్రాంగాన్ని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జిహెచ్ఎంసి సమీక్షా సమావేశం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో తక్కువ సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా జిహెచ్ఎంసి యంత్రాంగం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులనకు సూచించారు. ఈ మేరకు జిహెచ్ఎంసిలో ఉన్న వివిధ విభాగాల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్ళేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. నాలాల అభివృద్ది కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీకి తగిన పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. ఈ మేరకు నాలాలపైన క్యాపింగ్ లేదా ఫెన్సింగ్ వంటి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని కోరారు.
జీహెచ్ ఎంసీ పరిధిలోని వివిధ జోన్లలో ఉన్న నాలాల ఫెన్సింగ్ ఏర్పాట్లుపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలాల అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను జిహెచ్ఎంసి అందించడం ద్వారా ఎస్ యన్ డి పి ని (స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) మరింత బలోపేతం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాలాలకు సంబంధించిన కార్యక్రమాలను మేయర్ , కమిషనర్ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిహెచ్ఎంసి పరిధిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జరిపిన తవ్వకాల(ముఖ్యంగా రోడ్ల వద్ద) వద్ద అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాలలో భాగస్వాములైన వర్కింగ్ ఎజెన్సీలు, శాఖలకు ప్రత్యేకంగా ఈమేరకు అదేశాలు జారీ చేయాలన్నారు.
ఈ వర్షాకాలం సందర్భంగా నగరంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా హెల్త్, శానిటేషన్ విభాగాలు కలిసి పని చేయాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి వర్షాకాల ప్రణాళికలో పారిశుద్ధ్యానికి, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్, యాంటీ లార్వాల్ వంటి కార్యక్రమాలను ఎంటమాలజీ విభాగం మరింత పెంచాలన్నారు.