మత విశ్వాసాలు దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది : చంద్రబాబు
హైదరాబాద్ ,బంజారాహిల్స్
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు కనులపండుగగా జరిగాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయకచవితి అని..ఏ మంచి పని చేయాలన్న ముందుగా వినాయకుడిని పూజ నిర్వహించిన తర్వాతే పని ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఎన్నో ఏళ్ళుగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు .
సీఎంగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన గణనాధుడిని పూజిస్తానని చంద్రబాబు చెప్పారు . వారం పదిరోజుల పాటు పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తామని చెప్పారు .
మతాలపై విశ్వాసం దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదని చంద్రబాబు అన్నారు .హైదరాబాద్లో వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం ప్రక్రియను నిర్వహించామని..కానీ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఏ పాలకులు వ్యవహరించలేదన్నారు .పాలకులు ప్రతి ఒక్క మతాన్ని ,మత విశ్వాసాన్ని గౌరవించేలా ఉండాలన్నారు .ఇది రాజ్యాంగ కల్పించిన హక్కు అని చెప్పారు .ప్రభుత్వాలు సైతం అందుకు తగ్గట్టుగా ప్రవర్తించినప్పుడే శాంతి సౌభాగ్యం వెల్లువిరస్తుందని చెప్పారు .
అనంతరం టీటీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు . తెలంగాణ తెలుగు దేశం పార్టీ పనితీరుపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు .తెలుగు వారి గుండెల్లో తెలుగు దేశం పార్టీ ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు .టీటీడీపీ పనితీరు బాగుందని ప్రశంసించారు. ప్రజా సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు .తెలంగాణ తెలుగుదేశం పార్టీపై సమీక్ష నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని నరసింహులు , పోలిట్ బ్యురో సభ్యులు రావుల చంద్ర శేఖర్ రెడ్డి , జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ కంభంపాటి రామ్మెహాన్ రావు , జాతీయ పార్టీ ముఖ్యనాయకులు, రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు