బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతున్న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ హాజరైనారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముందుగా డా. ప్రసన్న కుమార్, ప్రిన్సిపల్ ఛీఫ్ మెడికల్ డైరెక్టర్, దక్షిణ మధ్య రైల్వే మరియు డా. జి ఉదయ చంద్ర, అదనపు డైరెక్టర్, CGHS లను శ్రీ నందమూరి బాలకృష్ణ ఘనంగా సన్మానించారు.
సన్మాన కార్యక్రమానంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అని మన సంస్కృతిలో పేర్కొనడమే వారికి మన సమాజంలో కలిపించిన స్థానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఎంతో ఆందోళనతో రోగానికి గురై వచ్చే పేషెంట్లకు వైద్యుడు దేవుని వలే కనిపిస్తాడని ఈ కోవలోనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పని చేస్తోందని చెప్పారు. గత వారం దేశానికి ప్రణాళికలు రూపొందించే నీతి ఆయోగ్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవలను గుర్తించిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ తో దీటుగా అంతర్జాతీయ స్థాయితో కూడిన నాణ్యమైన వైద్యం అందిస్తున్నదని పేర్కొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తనను వైద్యుడిగా చూడాలని ఆశించారని అయితే నిజ జీవితంలో అది నేరవేరకపోయినా ఇపుడు హాస్పిటల్ కు ఛైర్మన్ గా వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించడం తన తండ్రి కోరికను ఈ విధంగా నిజం చేసినట్లేనని భావిస్తున్నట్లు చెప్పారు. ఎలానైతే మహమ్మారి సమయంలో వైద్యులు కీలక పాత్ర పోషించారో భవిష్యత్తులోనూ ఇదే స్థాయి వైద్య సేవలు రోగులకు కలిపించడంలోనూ ముందంజలో ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఛీఫ్ మెడికల్ డైరెక్టర్ డా. ప్రసన్న కుమార్, మాట్లాడుతూ మహమ్మారి కాలంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా క్యాన్సర్ చికిత్సను అందించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సేవలను కొనియాడారు. ఆసుపత్రి సేవలకు నీతి ఆయోగ్ ఇచ్చిన గుర్తింపే నిదర్శనమన్నారు . ఎటువంటి లాభాలను ఆశించకుండా నగర మధ్యలో 500 పైగా పడకలతో కేవలం క్యాన్సర్ రోగుల కోసమే ఇంతటి మంచి హాస్పిటల్ నిర్వహించడం అనితర సాద్యమని చెప్పారు. సంస్థ రైల్వే ఉద్యోగులకు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం అదనపు డైరెక్టర్ డాక్టర్. జి ఉదయ చంద్ర మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు పంపిన పేషెంట్లలలో ఎవరూ కూడా ఈ సంస్థపై ఫిర్యాదులు చేయలేదని ఈ అంశమే ఈ హాస్పిటల్ రోగులకు కేవలం సేవా భావంతో అందిస్తున్న సేవలకు గుర్తింపని అన్నారు. దీనికి నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు దానిని కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ చేస్తున్న మంచి పనులలో ఇది ఒకటని ఇదే వారి సేవానిరతికి నిదర్శనమన్నారు .
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, సీఈఓ డా. ఆర్ వి ఫ్రభాకర రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు జేయస్ అర్ ప్రసాద్, మెడికల్ డైరెక్టర్ Dr టియస్ రావు,సీఓఓ జి రవి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఫణికోటేశ్వర రావు,అసోసియేట్ డైరెక్టర్ డా కల్పనా రఘునాథ్ లతో ప పాటూ మెడికల్ విభాగాధిపతులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు