బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్న మేయర్ విజయలక్ష్మీ

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్న మేయర్ విజయలక్ష్మీ

గ్రేటర్ హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో జరుపుకున్నారు. ఆసుపత్రి ఛైర్మన్ , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ఆమె క్యాన్సర్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు.మేయర్ గద్వాల విజయలక్ష్మికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. తమ కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు హాస్పిటల్ కు వచ్చిన మేయర్ ను ప్రత్యేక సారె అందజేసి సత్కరించారు.

అనంతరం మేయర్ పుట్టిన రోజు పురస్కరించుకొని హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కేక్ ను మేయర్ గద్వాల విజయలక్ష్మి కట్ చేశారు. కేక్ కటింగ్ అనంతరం హైదరాబాద్ నగర ప్రధమ పౌరురాలు హాస్పిటల్ లో ఉన్న చిన్న పిల్లల వార్డు మరియు ఆరోగ్య శ్రీ వార్డులలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తేలియజేశారు. ఈ లోక మనుగడలో స్త్రీ ప్రధాన పాత్ర పోసిస్తున్నదని, స్త్రీ లేకుంటే మనుగడే లేదన్న విషయాన్ని గుర్తించిన తమ నాన్న గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ఎన్నికలలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. అలానే మహిళలకు ప్రత్యేకంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని అంటూ అదే కోవలో హిందుపురం నియోజకవర్గంలో భాగమైన హిందుపురం మునిసిపాలిటీ కి కూడా మొదటి సారి మహిళలను ఛైర్ పర్సన్ గా చేయడం జరిగిందని ఆయన చెప్పారు. జర్నలిజంలో డిగ్రీ తో పాటూ న్యాయశాస్త్రంలో పట్టా పొంది అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొన్న మేయర్ ప్రజా సేవ చేయాలని నిర్ణయించి కొనసాగడం ఎంతో ప్రశంసనీయమని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ కు 5.75 కోట్ల రూపాయల బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ను మాఫీ చేస్తూ నిర్ణయం చేసి ఎంతో సహాయం చేశారని అలానే పలు సందర్భాలలో ముఖ్యమంత్రి హాస్పిటల్ కు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకొన్నారని కృతజ్ఞతలు తెలియజేశారు. అలాంటి కేసీఆర్ స్పూర్తితో, తండ్రి కేశవరావు గారు నడుపుతున్న భాటలో నడుస్తున్న విజయలక్ష్మిగారు నగర ప్రధమ పౌరులారిగా ఇక్కడకు రావడం ఎంతో సంతోషకరమైన అన్న అంశం అని అంటూ ఆమె ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

అనంతరం శ్రీమతి గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ గతంలో తాను మేయర్ గా హాస్పిటల్ ను సందర్శించడం జరిగిందని, ఆనాడే ఇక్కడ పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది నిబద్దత, సేవా తత్పరత అర్థమైనాయని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇదే విధానంలో పని చేస్తూ హాస్పిటల్ మరింత ప్రజాదరణ పోందుతుందని అశిస్తున్నట్లు ఆమె తెలిపారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేసిన శ్రీ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమాలలో నందమూరి బాలకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు జెయస్ ఆర్ ప్రసాద్, సీఈఓ డా. ఆర్ వి ప్రభాకర రావు,సీఓఓ రవికుమార్ , మెడికల్ సూపరిండెంట్ డా. ఫణి కోటేశ్వర రావు,అసోసియేట్ డైరెక్టర్ డా. కల్పనా రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *