ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప వరం యోగ :ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతి యోగా అని పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో భారతీయ సంప్రదాయ విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“యోగా అనేది మానవాళికి భారత్ అందించిన గొప్ప బహుమతి. దైనందిన జీవితంపై ఆసక్తిని పెంచుతూ.. వారి జీవితాల్లో గొప్ప మార్పును కలిగించేందుకు దోహదం చేస్తుంది.”-వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి
శారీరక ఆరోగ్యం, మానసిక సంతులనం పొందడం సహా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఉత్తమమైన మార్గమని వెంకయ్య నాయుడు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ దాన్ని సాధన చేయాలని సూచించారు.