పాన్ కార్డ్ కు ఆధార్ నెంబర్ అనుసంధాన గడువు ను సెప్టెంబర్ 30 వ తేదీ వరకు పెంపు
న్యూఢిల్లీ
పాన్ కార్డు, ఆధార్ అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా గడువును మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30ని తాజాగా గడువుగా పేర్కొంది. గతంలో విధించిన గడువు జూన్ 30తో ముగస్తున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది. పాన్- ఆధార్కు 2020 మార్చి 31ను తొలుత గడువుగా పేర్కొంది. తర్వాత దాన్ని 2020 జూన్ 30కి, తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం ఈ ఏడాది జూన్ 30కి మరోసారి కేంద్రం పలు దఫాలుగా గడువు పొడిగిస్తూ వచ్చింది.పాన్- ఆధార్తో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఉద్యోగి కొవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. అలాగే, కొవిడ్తో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును మరో రెండు నెలలు అంటే ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫారం-16లోని టీడీఎస్ సర్టిఫికెట్ను ఉద్యోగులకు అందించే గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.