నష్టాల్లో ఉన్న మెట్రో రైలును అదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది: సీఎం కేసీఆర్
కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైద్రాబాద్ మెట్రో సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా చర్యలు తీసుకోవాలని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎల్ అండ్ టి సంస్థ అధికారులకు సిఎం కేసీఆర్ తెలిపారు.
కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవాణా అంశం పై ప్రగతి భవన్ లో ఎల్ అండ్ టీ సంస్థ సీఈవో , ఎండీ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం సిఎం కెసిఆర్ తో సమావేశమయ్యారు. కరోనా లాక్ డౌన్ కారణంగా మెట్రో నష్టాల్లో నడుస్తున్నదని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు.
ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో మెట్రో రైలు కు సంబంధించిన రవాణా, తదితర అంశాలు చర్చించిన సిఎం, వారి అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించారు. మెట్రో రైలుకు సబంధించి, ఎల్ అండ్ టీ సంస్థకు, ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సిఎం సూచించారు. ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించి తనకు నివేదికను అందచేయాలని సిఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో హోంశాఖామంత్రి మహమూద్ అలీ, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ డికె సేన్, ప్రాజెక్టుల సీఈవో అజిత్, హైద్రాబాద్ మెట్రో సీఈవో కెవిబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.