తెలంగాణలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సూచన

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగాయి. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిందనే విషయంపై సబ్ కమిటీ చర్చించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా భూముల విలువ పెరిగినా,  గత ఎనిమిది సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో ఏలాంటి పెంపు చేయలేదు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని సబ్ కమిటీ దృష్టికి అధికారులు తెలిపారు .చాలామంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి  లావాదేవీల వలన సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు విలువల సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 సంవత్సరాల్లో ఏడుసార్లు భూ విలువలను సవరించి, రిజిస్ట్రేషన్ ఫీజులను 11 శాతానికి పెంచిన విషయము ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ  సమావేశంలో చర్చకు వచ్చింది. పక్కనే ఉన్న తమిళనాడులో 7.5, మహారాష్ట్రలో 7 శాతం గా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయని అధికారులు మంత్రులకు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయంలో ప్రధాన వాటా కలిగిన హైదరాబాద్ మరియు హెచ్ఎండిఎ పరిధిలో పెద్ద ఎత్తున భూములు, ఆస్తుల విలువలు పెరిగిన విషయం సబ్ కమిటీలో చర్చకు వచ్చింది. గత ఏడు సంవత్సరాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పెట్టుబడులు, నూతన పరిశ్రమల ఏర్పాటు,  నగర విస్తరణ వలన రియల్ భూమ్ వచ్చిందన్నారు.  2019- 20 సంవత్సరానికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో సుమారు 51 శాతం లావాదేవీలు ప్రభుత్వ నిర్ధారిత విలువలకు మించి అధికంగా రిజిస్ట్రేషన్లు అయిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు. మరోవైపు ప్రభుత్వ విలువ మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా ఉండటంతో భూములు ఇల్లు కొనుగోలు చేసే ప్రజలకు బ్యాంకు లోన్లు రావడంలో కొన్ని పరిమితులు ఉంటున్నాయని, ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు పెరిగిన విలువకు అనుగుణంగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.

ఇలా వివిధ కారణాల ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువల సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి కేబినెట్ సబ్ కమిటీ వచ్చింది.  ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి త్వరలోనే నివేదిక అందించనుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *